TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం 18 నుంచి 20వ తేదీ ఉదయం ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని చెప్పింది. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల డబ్బులు చెల్లిస్తేనే టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల మే నెల కోటాను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు దేవస్థానం పేర్కొంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 22న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్ రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. తిరుమల, తిరుపతిలలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్న చెప్పింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.