తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో ఆగస్టు 12న రెండో విడతగా తిరుమల-తిరుపతి రెండు ఘాట్ రోడ్లు, నడకదారుల్లో నిర్వహించనున్న ‘శుద్ధ తిరుమల- సుందర తిరుమల’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. టీటీడీ విద్యాసంస్థల నుంచి 750 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఒక్కో సెక్టార్లో 30 మంది చొప్పున 25 సెక్టార్లుగా విభజించామని చెప్పారు.
ఒక్కో సెక్టార్ లో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఇతర విద్యార్థులతోపాటు హెల్త్ వర్కర్, ఇంజినీరింగ్ మజ్దూరు, విజిలెన్స్ సెక్యూరిటీ గార్డ్, సెక్టోరియల్ ఆఫీసర్ ఉంటారని వెల్లడించారు. సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల, పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, ఎస్వీ ఓరియంటల్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొంటారని వివరించారు.
ఇందుకు సంబంధించిన రవాణా, శానిటరీ మెటీరియల్, క్యాటరింగ్, ప్రథమ చికిత్స కిట్లు, చెత్త సేకరణ, రోప్ లు, వైర్ లెస్ సెట్లు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమీక్షలో డీఈవో భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, సుబ్రహ్మణ్యం, డీఎఫ్వో శ్రీనివాస్ , హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, అదనపు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, ఈఈలు పాల్గొన్నారు.