తిరుమల : తిరుమల(Tirumala)శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 12 నుంచి 2024 జనవరి 5వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో ఈ అధ్యయనోత్సవం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారని వివరించారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారని వెల్లడించారు.
తొలి 11 రోజులను పగల్పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారని చెప్పారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయని తెలిపారు.