తిరుపతి : సరఫరాదారులు అత్యంత నాణ్యమైన వంటసరుకులు, ఇతర వస్తువులను టీటీడీకి సరఫరా చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సరఫరాదారులతో ఈవో సమావేశం నిర్వహించారు.శ్రీవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు వస్తున్నారని, వీరి సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులు నాణ్యంగా ఉండాలన్నారు.
భక్తులు అందించిన కానుకలతో సరఫరాదారులకు సొమ్ము చెల్లింపు జరుగుతుందని, కావున సరఫరాదారులు నిజాయితీగా, న్యాయబద్ధంగా వ్యాపారం చేయాలని కోరారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని బయోడిగ్రేడబుల్ ప్లేట్లు, కప్పులు సరఫరా చేయాలని కోరారు. ఈ సందర్భంగా బియ్యం, నెయ్యి, చక్కెర, పప్పులు, బాదం, జీడిపప్పు, బెల్లం, నూనె, కొబ్బరికాయలు, కర్పూరం, శానిటరీ ఉత్పత్తులు, చీరలు, పంచలు, పేపర్ ప్లేట్లు తదితర వస్తువుల సరఫరాదారులతో ఈవో నేరుగా మాట్లాడి సేకరణ, తయారీ విధానం, బిల్లుల చెల్లింపు తదతర విషయాలను అడిగి తెలుసుకున్నారు.