తిరుమల : కాషన్ డిపాజిట్ సొమ్ముపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు విచారం వ్యక్తం చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటున్నదంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని పేర్కొన్నది. ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాషన్ డిపాజిట్ సొమ్మును ఎప్పటికప్పుడు భక్తుల ఖాతాల్లోకి పంపుతున్నామని తెలిపింది. అవాస్తవాలను ప్రచారం చేసిన టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై టీటీడీ అధికారులు తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరంట్ బుకింగ్, ఆన్లైన్ బుకింగ్ విధానంలో గదులు బుక్ చేసుకున్న భక్తులు.. గదులు ఖాళీ చేసిన తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు కాషన్ డిపాజిట్ రీఫండ్ ఎలిజిబిలిటి స్టేట్మెంట్ను పంపిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అధీకృత బ్యాంకుల అధికారులు అదేరోజు అర్ధరాత్రి 12 గంటలలోపు సంబంధిత మర్చంట్ సర్వీసెస్కు.. అక్కడి నుంచి మరుసటిరోజు కస్టమర్ బ్యాంకు అకౌంట్లో జమ అవుతుందని తెలిపింది. కస్టమర్ బ్యాంకు వద్దనే సొమ్ము చెల్లించడంలో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం 7 పనిదినాల్లో కాషన్ డిపాజిట్ రీఫండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జులై 11 నుంచి 4, 5 రోజుల్లో టీటీడీ యూపీఐ విధానంలో రీఫండ్ చేయడం వల్ల నేరుగా భక్తుల అకౌంట్కే రీఫండ్ సొమ్ము వచ్చినట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, కొందరు వ్యక్తులు పనిగట్టుకుని కాషన్ డిపాజిట్కు సంబంధించి దుష్ప్రచారం చేయడం మంచిది కాదని టీటీడీ పేర్కొన్నది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. అవాస్తవాలను ప్రచారం చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.