TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఎల్లుండి ( ఈ నెల 18వ తేదీన ) విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 20వ తేదీన లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది.
ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.