తిరుపతి: విశాఖపట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం కుంభాభిషేకం త్వరలో జరుగనున్నది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతిలో మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ కుంభాభిషేకం జరిగిన రోజు నుంచే పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఐదు రోజుల పాటు కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించి చివరిరోజు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
ప్రధాన ఆలయంతోపాటు ఆండాళ్ అమ్మవారు, శ్రీ పద్మావతి దేవి అమ్మవారు, శ్రీ ఆంజనేయస్వామి ఉప ఆలయాల పనులు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు. సిబ్బంది నివాస గృహాలకు రోడ్డు నిర్మాణం పెండింగ్లో ఉందని, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని కుంభాభిషేకానికి వారం రోజుల ముందే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ అధికారులతో మాట్లాడి ఆలయంలో మొక్కలు, ఉద్యానవనాల పెంపకానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయంలో కనువిందుగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలన్నారు.
కుంభాభిషేకం సందర్భంగా వాహనాల పార్కింగ్కు, విఐపిల భద్రతకు ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసు అధికారులను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని జెఈవో ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా విష్ణుసహస్రనామ పారాయణం, హరికథ, అన్నమాచార్య సంకీర్తనల గానం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి విభాగం అధికారులు కుంభాభిషేకానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై చెక్లిస్టు తయారు చేసుకుని ప్రతిరోజూ పురోగతిని పరిశీలించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు త్వరలో సంయుక్తంగా ఆలయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అర్చకులతోపాటు ఎఫ్ఎంఎస్, సెక్యూరిటీ, క్యాంటిన్ సిబ్బందిని తగినంత మందిని డెప్యుటేషన్పై పంపాలని, వారికి అవసరమైన వసతి, భోజనం తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు.