తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అత్యవసర వైద్యం అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా గుండెపోటు నుంచి రక్షించేందుకు తిరుపతిలోని రుయా ఆసుపత్రి ఆధ్వర్యంలో టెనెక్టేస్ ప్లస్ అనే ఇంజక్షన్ ను అందుబాటులోకి తెచ్చినట్లు టిటిడి అదనపు ఈవో ఏ.వీ.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆయన ఈ ఇంజక్షన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో రుయా ఆసుపత్రికి మాత్రమే ఈ ప్రాజెక్టు మంజూరైందని తెలిపారు.
తిరుపతి కేంద్రంగా చుట్టుపక్కల 13 ప్రాంతాల్లో ఈ ఇంజక్షన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మార్కెట్లో దీని ధర రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. రుయా ఆసుపత్రిలో దీన్ని ఉచితంగా అందిస్తామని చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని, చాలా మంది భక్తులు కాలినడకన మెట్ల మార్గంలో తిరుమలకు వస్తుంటారని, కొంతమంది గుండెపోటుకు గురవుతున్నారని చెప్పారు.
ఈ కారణంగానే అపోలో ఆసుపత్రి నుంచి ప్రత్యేక కార్డియాక్ సెంటర్ను తిరుమలలో నిర్వహిస్తున్నామన్నారు. దానికి తోడు రుయా ఆసుపత్రి నుంచి ఈ ఇంజక్షన్ ఇవ్వడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇందుకు కృషి చేసిన ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఇంజక్షన్ వేయడంపై అశ్వనీ ఆసుపత్రి వైద్యసిబ్బందికి, అపోలో కార్డియాక్ సెంటర్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు.