TTD News | శ్రీనివాస సేతు నిర్మాణం పెండింగ్ పనులన్నింటినీ డిసెంబరు 31 లోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ వంతెన పనులు వీలైనంత త్వరగా పూర్తిచేసినట్లయితే తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చునన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని కార్యాలయంలో సాయంత్రం ఆయన మున్సిపల్, స్మార్ట్ సిటి కార్పొరేషన్, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రామానుజ సర్కిల్లో ఏర్పాటు చేయాల్సిన ఫ్యాబ్రికేటెడ్ గడ్డర్ త్వరగా తెప్పించి పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈలోపు రోడ్లు, కాలువలు, ఫుట్పాత్, మీడియన్ల పనులు చేపట్టాలని చెప్పారు. రామానుజ సర్కిల్ నుంచి మామిడికాయల మండీ, కళాంజలి షోరూం, ఆర్టీసీ బస్టాండు, సుబ్బలక్ష్మి విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ కలిపి ఐదు సెగ్మెంట్ల పనుల్లో వేగం పెంచాలని కోరారు. సుబ్బలక్ష్మి సర్కిల్ నుంచి రామానుజ సర్కిల్ వరకు పనులు ప్రారంభించడానికి ముందే పోలీస్ శాఖకు సమాచారం అందించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మ్యాన్పవర్ను పెంచాలని ఆయన సూచించారు.
జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కుమారి అనుపమ అంజలి, ఎఫ్ఏసీఏఓ బాలాజి, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈలు మోహన్, జగదీశ్వర్రెడ్డి, స్మార్ట్ సిటి కార్పొరేషన్ జీఎం చంద్రమౌళి తదితర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.