తిరుపతి : సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కృషి చేస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chairman ) తెలిపారు. ఉద్యోగులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందజేస్తామని తెలియజేశారు. ఉద్యోగులు అంతర్గత ఇబ్బందులు విడనాడి ఏకంగా సహకరించాలని కోరారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో (Independence ) జాతీయజెండాను ఎగురవేసి మాట్లాడారు. శ్రీమహావిష్ణువు స్వయంభుగా వెలసిన తిరుమల ప్రదేశంలో భక్తులకు సేవలందించడం ఉద్యోగుల జన్మజన్మల పుణ్యఫలమని, హిందూ ధర్మాన్ని పాటించే హిందువులందరికీ టీటీడీ పెద్దదిక్కుగా నిలుస్తోందని పేర్కొన్నారు.
వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం మంజూరు చేసిన 310 ఎకరాల భూమిని ఈవో ఎవి ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో కలసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు18న సీఎం జగన్ చేతుల మీదుగా ఇంటిస్థలాల పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు.
అవసరమైతే మరో 100 ఎకరాలైనా ప్రభుత్వం నుంచి సేకరించి అందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు 35×55 అడుగుల ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. దాదాపు 7 వేల మంది ఉద్యోగులకు ఇక్కడ ఇంటి స్థలాలు రావడంతో పెద్ద టౌన్ షిప్ తయారవుతుందన్నారు. చెన్నై హైవే పక్కనే ఈ స్థలం ఉండడంతో మంచి ధర పలుకుతోందన్నారు.
ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేత
తిరుపతి : స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా పరేడ్ మైదానంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 30 మంది అధికారులు, 219 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన దేశభక్తి, ఆధ్యాత్మిక గీతాలు ఆకట్టుకున్నాయి.