తిరుమల : తిరుమల(Tirumala)లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నారని టీటీడీ (TTD) ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ( Face recognition technology) వల్ల గదుల రొటేషన్ పూర్తిగా తగ్గిందన్నారు . దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు తెలిపారు.
ఒకసారి తమ ఆధార్ కార్డు(Aadhar)తో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాతే గదులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. మార్చి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గదుల కేటాయింపు ద్వారా అత్యధికంగా రూ.2.95 కోట్ల రాబడి వచ్చిందని తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్, కరెంటు బుకింగ్ లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వసతి కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సీఆర్వో (CRO) వద్దకు మార్చనున్నట్లు తెలిపారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 లో భక్తులకు అందించే ఉచిత లడ్డులో కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అక్రమాలను అరికట్టినట్లు తెలిపారు. తద్వారా వ్యక్తి లేకుండా లడ్డు టోకెన్ రాదన్నారు. ఈ సమావేశంలో సీఈ నాగేశ్వరరావు, ఎస్ ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్ బాబు, రిసెప్షన్ డిప్యూటీ ఈవోలు హరింద్రనాథ్, భాస్కర్, ఏఈవో వెంకటేశ్వర్లు నాయుడు పాల్గొన్నారు.