తిరుపతి : తిరుపతిలోని స్విమ్స్లో ఏర్పాటు చేస్తున్న శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (క్యాన్సర్ హాస్పిటల్) లో అన్ని రకాల క్యాన్సర్ల (Cancer ) కు అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి (EO Dharma Reddy ) వెల్లడించారు. ఇందుకోసం అత్యాధునిక వైద్య వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లలకు నిర్వహిస్తున్న క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ పరీక్షల పై శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వల్ల దేశంలో ఏటా 7 లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు. క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించడం, సరైన చికిత్స అందించడం ఈ సమస్యను అధిగమించడానికి మార్గాలన్నారు. నేటి పరిస్థితుల్లో మానవాళి తీసుకుంటున్న ఆహారం ( Food ) , జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం కూడా క్యాన్సర్ వ్యాధి అంతకంతకు పెరగడానికి ఒక కారణమని అన్నారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతో పండిస్తున్న ఉత్పత్తులవల్ల ఆ అవశేషాలు మానవ శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ రావడానికి మరో కారణం అవుతున్నాయని వివరించారు.
మానవులు రోగాల బారిన పడకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన జీవనవిధానం అలవర్చుకోవాలనే విషయాలు పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో వివరించారన్నారు. యోగా ద్వారా మెదడును బలోపేతం చేసుకుంటే శరీరాన్ని నియంత్రించుకోవచ్చన్నారు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ను దూరం చేయవచ్చునని ఈవో చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ జేఈవో, స్విమ్స్ డైరెక్టర్ సదా భార్గవి మాట్లాడుతూ జిల్లాలో గూడూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధిని గుర్తించడానికి శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేయడానికి టీటీడీ నిర్ణయించిందన్నారు.