తిరుపతి : తిరుచానూరు(Tiruchanoor Temple) శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు(Teppotsavam )మే 31 వ తేదీ నుండి జూన్ 4 వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు (TTD Officials) వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారని వివరించారు.
ఈ ఉత్సవాల్లో అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారని చెప్పారు. ప్రతి ఏటా జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారికి తెప్పోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. పద్మసరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని పేర్కొన్నారు. మే 31న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారన్నారు.
ఆర్జితసేవలు రద్దు
తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.