Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మల్లికార్జున సత్ర సంఘం, ఆర్యవైశ్య దివ్యసేవాధామం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నూతనంగా నిర్మించిన టిజి లక్ష్మీ వెంకటేష్ భవన్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండోరోజు మంగళవారం ఉదయం భవన ప్రారంభ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆర్ధిక- వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. వీరిని ఆర్యవైశ్య సంఘం కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించి ఙ్ఞాపికలను అందజేశారు.
యాంత్రిక జీవనాలకు అలవాటు పడుతున్న మానవాళికి సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేయడం అలవర్చుకోవడంతో మానసిక ఉల్లాసమే కాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని మంత్రి సంగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శ్రీశైల క్షేత్రానికి దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులు వచ్చి వెళ్లే క్రమంలో వారి సౌకర్యార్థం ఇటువంటి వసతి గదుల నిర్మాణం హర్షనీయమని ఆర్యవైశ్య సంఘం నిర్వాహకులను ప్రశంసించారు.
ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాలను చేయడంలోనూ ఐకమత్యంగా ఉండటం అభినందనీయమని మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. తెలంగాణ నుండి వచ్చే వారితోపాటు అందరికీ అందుబాటులో ఉండేలా చేపట్టిన 143 గదుల నిర్మాణ దాతలకు శుభాకాంక్షలు చెప్పారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల వర్తక వ్యాపారులు చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు శ్రీశైల దేవస్థానం అందిస్తున్న సహకారానికి కృతఙ్ఞతలు తెలిపారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆశీస్సులతో ఈ సేవలను మరింత విసృతపరుచుకునేలా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసుకోవాలని సూచించారు.
భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆడపడుచులతో కలిసి నేనే స్వయంగా సెల్ఫీ చిత్రాలు తీసి ఇస్తానని మంత్రి హరీశ్ రావు సందడి చేశారు. పేరుపేరునా ప్రతి ఒక్కరితో మాట్లాడిన ఆయన సుమారు గంటపాటు ఆర్యవైశ్య భవన్లో ఉన్నారు. యాత్రికుల కోసం నిర్మించిన గదులలో సౌకార్యాలను కూడా స్వయంగా పరిశీలించారు.
శ్రీశైలంలో చేపట్టిన ఆర్యవైశ్య భవన నిర్మాణం అందరికీ ఆదర్శనీయమని.. ఇటువంటి మంచి పనులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ మల్లన్న భక్తులకు సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కూడా కల్పించాలని ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులను కోరారు. సంఘం అధ్యక్షుడు మిడిదిడ్డి శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి బలుస శ్రీరాములుతోపాటు సంఘం ప్రతినిధులందరినీ అభినందించారు.