Srisailam | శ్రీశైల మహా క్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. పరోక్షసేవలో భాగంగా 50 మంది భక్తులు తమ గోత్రనామాలను నమోదు చేసుకొన్నట్లు అధికారులు చెప్పారు. ఆదివారం ప్రదోషకాల సమయంలో నందిమండపంలోని శనగల బసవన్నకు పంచామృతాభిషేకాలు జరిపించి, నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.
అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. అదేవిధంగా అమ్మవారి ఆలయ ప్రాకార మండపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన పల్లకిలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆలయ ప్రదక్షిణ చేశారు.
ఆలయ దక్షిణ మాఢవీధిలో కళారాధన వేదిక పై హైదరాబాద్ నగరానికి చెందిన మధురిమ ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్యరూపక కార్యక్రమాలు నిర్వహించినట్లు పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.