Pithapuram | పిఠాపురంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఈసారైనా ఆయన గెలుస్తారా? అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బిగ్బాస్ ఫేమ్, ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి కూడా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్పై పోటీ చేసేందుకు సిద్ధమయ్యింది.
భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) తరఫున పిఠాపురం నుంచి తమన్నా సింహాద్రి పోటీ చేయనుంది. ఈ విషయాన్ని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా ఆకుల జయ కళ్యాణి వ్యవహరించనున్నారు. కాగా, తమన్న సింహాద్రి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారేమీ కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేశ్పై పోటీ చేసింది.
ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నినియోజకవర్గానికి చెందిన ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి సినీరంగంలో అవకాశాల కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది. తనకు ఉన్న కాంటాక్ట్స్ ద్వారా బిగ్బాస్ రియాల్టీ షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఈ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసింది. గతంలో జనసేనలోనూ తమన్నా సింహాద్రి పనిచేసింది. కానీ ఆ సమయంలో కనీసం పవన్ కళ్యాణ్ను కలిసే అవకాశం కూడా రాలేదని చాలా బాధపడింది. పైగా గత ఎన్నికల్లో జనసేన నుంచి టికెట్ ఆశించినప్పటికీ పార్టీ పట్టించుకోలేదు. దీంతో జనసేను వీడింది తమన్నా సింహాద్రి. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్పైనే పోటీకి దిగింది.