తిరుపతి : సనాతన హిందూ ధర్మ ప్రచార వారధులుగా పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి పిలుపునిచ్చారు. ఉద్యోగులు , సిబ్బంది సమధర్మ భావనతో మెలిగినప్పుడు తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుంటుందన్నారు. నిత్య జీవితం, ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడిని జయించడానికి టీటీడీ సీనియర్ అధికారులకు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం మొదటి బ్యాచ్ శిక్షణ తిరుపతిలోని శ్వేత భవన్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఒడిశాకు చెందిన జై గంగ లైఫ్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో టీటీడీ నిర్వహిస్తున్నది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ, శరీరం, మనసు యాంత్రికంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికారులు, ఉద్యోగులకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ధర్మ మార్గంలో నడిచే టీటీడీ ఉద్యోగులు తమ మార్గాన్ని మరింత మంచిగా తయారు చేసుకోవచ్చనన్నారు. అధికారులు, ఉద్యోగులు ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా అర్థం చేసుకుని, మనసుతో పరిష్కార మార్గాలు ఆలోచించాలని సూచించారు. తెలియకుండానే ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి సానుకూల ఆలోచనలు, ఒత్తిడిని జయించే శక్తి, ఆలోచన అవసరమని ఆమె వివరించారు. అహంకారాన్ని పక్కన పెట్టి చేసే ఏపనైనా విజయవంతం అవుతుందన్నారు.
ఒత్తిడిని జయించే మార్గాలపై జై గంగ లైఫ్ అకాడమీ నిర్వాహకులు కిరణ్ శిక్షణ అందించారు. మనిషి అంతర్ముఖం, బాహ్య ముఖం అనే రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నారని కిరణ్ జీ చెప్పారు. క్షమా గుణం అలవరచుకుంటే శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా జీవించవచ్చనన్నారు. సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన మంగళ నారాయణి, శ్వేత భవనం సంచాలకురాలు శ్రీమతి ప్రశాంతి పాల్గొన్నారు. జూలై 16వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగనున్నది.