అమరావతి : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళను గూడూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఢీ కొంది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక మహిళ పట్టాలపై నిల్చుని ఉండగా అటువైపు వస్తున్న రైలును గమనించిన మరో ఇద్దరు ఆమెను కాపాడబోయి రైలు ఢీకొని చనిపోయారని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతుల వద్ద సంచుల్లో లభించిన ఉన్న ఆధారాల ప్రకారం పోలీసులు పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.