అమరావతి : అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తల్లీ కూతురు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో విషాదం నింపింది. జిల్లాలోని మద్దిలపాలెం కృష్ణా కళాశాల సమీపంలో ఈ దారుణం జరిగింది. రెండ్రోజుల క్రితం తల్లి శైలజ ఆమె ఇద్దరు కుమార్తెలకు పురుగుల మందు ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడింది.
వారిని కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ తల్లి, చిన్న కూతురు ఇవాళ మృతి చెందారు. పెద్ద కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్తింటి వేధింపులు భరించలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని శైలజ తల్లి ఎంవీపీ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.