 
                                                            తిరుపతి : దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో తిరుపతి(Tirupati) శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ( Metlapuja ) శుక్రవారం తెల్లవారుజామున అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు కలిసి మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) మాట్లాడుతూ పూర్వం పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు.
ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.
 
                            