తిరుమల : హనుమజ్జయంతి ఉత్సవాల్లో చివరిరోజు ఆదివారం తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 18 గంటల పాటు అఖండ పారాయణం కొనసాగుతుందని వెల్లడించారు.
హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2,808 శ్లోకాలను పండితులు పారాయణం చేస్తారని వివరించారు. హనుమంతుడు విశ్రాంతి లేకుండా రామకార్యం కోసం వెళ్లిన విధంగా పండితులు నిరంతరాయంగా సంపూర్ణ సుందరకాండను పారాయణం చేస్తారని తెలిపారు.
నిన్న 73,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా వీరిలో 41,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. 29 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచిఉన్నారని వీరికి 24 గంటల్లో దర్శనం అవుతుందని వెల్లడించారు.