తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25 న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ (TTD) ఆలయ అధికారులు వెల్లడించారు. ఆస్థానమండపంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తామన్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. భక్తులు నేరుగా వ్రతంలో పాల్గొనేందుకు ఈనెల 18న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో ( Online Tickets) 150 టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఆలయం వద్ద గల కుంకుమార్చన కౌంటర్లో ఆగస్టు 24 ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్లో 150 టికెట్లు విక్రయిస్తామని చెప్పారు. వ్రతంలో పాల్గొనే వారు. రూ.1000 చెల్లించి టికెట్ కొనుగోలు చేయవచ్చని, ఒక టికెట్పై ఇద్దరు గృహస్తులకు అనుమతి ఉంటుందని అన్నారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగస్టు 18న ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుందని వివరించారు. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు ఆగస్టు 26 నుంచి 90 రోజులలోపు అమ్మవారి దర్శనానికి అనుమతి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.