తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 9న కార్తిక వనభోజనాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు(Temple Officials) తెలిపారు. ఈ సందర్భంగా నిత్య కల్యాణోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు వివరించారు.
పవిత్రమైన కార్తిక మాసంలో ద్వాదశి నాడు ఆలయంలో వనభోజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి ఉదయం 9 గంటలకు శ్రీవారి మెట్టు వద్ద పార్వేట మండపానికి తీసుకువచ్చి స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తామన్నారు.
ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకం చేస్తారని తెలిపారు. అనంతరం అలంకారం, వనభోజనం, సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తయిన తరువాత ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకెళ్తామని వివరించారు.