తిరుపతి : ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయంలో నిర్వహించే పలు సేవలను రద్దు చేసినట్లు టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. ఆలయంలో నిర్వహించే లక్ష్మీపూజ, ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజలసేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.
రథసప్తమి రోజున అమ్మవారిని ఏడు వాహనాలపై ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. 16వ తేదీ సూర్యప్రభ వాహనం, హంస వాహనం, అశ్వ వాహనం, గరుడ వాహనంపై మధ్యాహ్నం చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, గజ వాహనంపై అమ్మవారు దర్శనమిస్తారని వెల్లడించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 13న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నామని తెలిపారు.