తిరుపతి :తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై టీటీడీ విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి అతివేగమా ? డ్రైవర్ నిర్లక్ష్యమా అనే కోణంలో దర్యాప్తు జరిపి నివేదికను ఇవ్వాలని టీటీడీ చైర్మన్( TTD Chairman) వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
బుధవారం ఘాట్ రోడ్డు లో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చైర్మన్,టీటీడీ సీవీ ఎస్వో నరసింహ కిషోర్, రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం చెంగల్ రెడ్డి, ఓలెక్ట్రా విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులతో కలిసి గురువారం పరిశీలించారు. చైర్మన్ మాట్లాడుతూ బస్సు లో సాంకేతిక ఇబ్బందులు లేవని ఓలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు సమాచారం ఇచ్చారన్నారని వెల్లడించారు.
వేంకటేశ్వర స్వామి దయ వల్ల బస్సులోని ప్రయాణీకులెవరికీ పెద్ద గాయాలు కాలేదని అన్నారు. తిరుమలకు వచ్చిన భక్తులను క్షేమంగా తిరుపతికి చేర్చడానికి టీటీడీ(TTD) అన్ని భద్రతా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరక్కుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విద్యుత్ బస్సుల డ్రైవర్లకు మరోసారి శిక్షణ ఇప్పించాలని చైర్మన్ అధికారులకు సూచించారు. డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్(Retaining concrete wall ) నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.