తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి అలిపిరి(Alipiri)నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్(Bhudevi complex) వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుందని ,లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించబడదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు(Divya darsan tokens) పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలని, అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారని వెల్లడించారు.
వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తులకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారని , భక్తులు ఈ విషయాలను గమనించి సహకరించాలని కోరారు.