తిరుమల : తిరుమల(Tirumala)లోని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మాఢ వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవుల కారణంగా కూడా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో కంపార్ట్మెంట్లు(Compartments) అన్నీ నిండిపోయి భక్తులు గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు(Ttd Officers) వెల్లడించారు. నిన్న 79,207 మంది భక్తులు దర్శించుకోగా 41,427 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.19 కోట్లు వచ్చిందని తెలిపారు.
మే 21 నుంచి తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మహో సంప్రోక్షణ కార్యక్రమాలు
తిరుపతి(Tirupati) శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మే 21 నుంచి 25వ తేదీ వరకు బంగారు తాపడం విమాన గోపురం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయి. మే 26 నుంచి జూన్ 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Annual Brahmotsavams) నిర్వహించనున్నారు. ఈ రెండు కార్యక్రమాల ఏర్పాట్లపై జేఈవో వీరబ్రహ్మం అధికారులతో ఆలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ మహాసంప్రోక్షణకు మే 20న అంకురార్పణ జరుగుతుందన్నారు. మే 21 నుంచి 24వ తేదీ వరకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు . మే 25న పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ నిర్వహిస్తామని వివరించారు. ఇందుకోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై విభాగాల వారీగా అధికారులతో సమీక్షించినట్లు ఆయన చెప్పారు. మహా సంప్రోక్షణ కారణంగా మే 20 నుంచి 25వ తేదీ వరకు ఆలయంలో ఊంజల్ సేవను రద్దు చేసినట్లు తెలిపారు.