చిత్తూరు: పెళ్లి పేరుతో ముగ్గురు మహిళలను ఓ వ్యక్తి మోసం చేశాడు. వరకట్నం కోసం వేధించి దొరికిపోయాడు. దాంతో ఆ మోసగాడి బండారం బయటపడింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ నాయకుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నాయకుడు టీడీపీకి చెందిన దండుపల్లె మంజునాథ్గా పోలీసులు గుర్తించారు. పెద్దతిప్పసముద్రం ఎస్ఐ మధు రామచంద్ర కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం నవాబుకోటకు చెందిన దండుపల్లె మంజునాథ్ ఒకరికి తెలియకుండా ఒకర్ని ఇలా ముగ్గుర్ని పెండ్లి చేసుకున్నాడు. ఆపై అదనపు కట్నం డబ్బుల కోసం మహిళలను వేధించేవాడు. అతడి చేతిలో మోసపోయిన ఇద్దరు మహిళల ఫిర్యాదుతో విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. అతడి మూడో భార్య ఎస్ ప్రియాంక కర్ణాటకలోని దావనగిరి నుంచి వచ్చి అతడిపై ఫిర్యాదు చేసింది. దాంతో, మంజునాథ్తోపాటు తల్లి వెంకట రమణమ్మ, తండ్రి వెంకటరమణ, సోదరి మమతపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
స్థానిక టీడీపీ నాయకుడిగా చలామణిలో ఉన్న మంజునాథ్పై గత నవంబర్ 11 న రెండో భార్య కర్ణాటకలోకి చిక్బల్పూర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు మంజూనాథ్ చెప్తున్నాడని, అయితే అధికారికంగా ఆమెకు విడాకులు ఇచ్చారా లేదా అనే విషయాన్ని విచారించి నిర్ధారిస్తామని ఎస్ఐ మధు రామచంద్ర తెలిపారు.