అమరావతి : ఏపీలో ఎన్నికల సందర్భంగా ఉన్న పొత్తులను కాదని ఏకపక్షంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చంద్రబాబు (Chandra Babu) అభ్యర్థుల పేర్లను ప్రకటించడం పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పొత్తు ధర్మం కాదంటూ పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. టీడీపీ రెండు సీట్లు ప్రకటించినందుకు నేనూ రెండు సీట్లు ప్రకటిస్తున్నానని వెల్లడించారు.
గణతంత్య్ర వేడుకల(Republic Day) సందర్భంగా మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుందని అన్నారు. మండపేట సీటును టీడీపీ(TDP) ప్రకటించడంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఇది పొత్తు ధర్మం కాదనేది నా అభిప్రాయమని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
రాబోయే ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తీసుకోవాలో జనసేనకు అవగాహన ఉందని అన్నారు. ఒంటరిగా వెళ్తే కొన్ని సీట్లు గెలుస్తాం. కాని ప్రభుత్వంలోకి వెళ్లలేమని తెలిపారు. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని, టీడీపీతో కలిస్తే బలవంతులమవుతామని వివరించారు. స్థానిక ఎన్నికల్లో మూడో వంతు సీట్లు సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని స్పష్టం చేశారు.