తూర్పు గోదావరి జిల్లా: దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. నిద్ర ముంచుకు రాగానే అక్కడే పడుకుని నిద్రపోయాడు. పడక గదిలో నుంచి గురక శబ్ధం రావడంతో మేల్కొన్న ఇంటి యజమాని.. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఆసక్తికరమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరంలో చోటు చేసుకున్నది. తన నిద్రలో గురకే తనను పోలీసులకు పట్టించిన వైనంపై స్థానికులు నవ్వుకుంటున్నారు.
గోకవరం పట్టణంలో సత్తి వెంకటరెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ బంక్ నిర్వహిస్తుంటాడు. రాత్రి 10 గంటలకు పెట్రోల్ బంక్ వద్ద పని ముగించుకుని, అమ్మకం డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాడు. వెంకటరెడ్డిని పసిగట్టిన సూరిబాబు అనే దొంగ ఆయనను ఫాలో అయ్యాడు. వెంకటరెడ్డి ఇంట్లోకి వెళ్లగానే ఆయన వెనకాలే చాకచక్యంగా సూరిబాబు ఇంట్లోకి దూరాడు. సరాసరి బెడ్రూంలోకి వెళ్లి ఆయన మంచం కిందనే దాక్కున్నాడు. వెంకటరెడ్డి నిద్రపోయిన తర్వాత నగదు ఎత్తుకెళ్లాలని దొంగ ప్లాన్. అయితే, వెంకటరెడ్డి లెక్కలు చూసుకుని పడుకునే సరికి రాత్రి చాలా ఆలస్యమైంది. ఆయన నిద్ర పోతాడని ఎదురు చూసి దొంగ సూరిబాబుకు నిద్రొచ్చింది. అంతే అక్కడే పడకేశాడు.
తెల్లవారు నాలుగున్నర వేళ తన గది లోంచి గురక శబ్దం వినిపించే సరికి వెంకటరెడ్డికి మెలుకువ వచ్చింది. ఎవరిది ఈ గురక అంటూ ఇంట్లో వెతికాడు. చివరకు తన మంచం కిందనే పడుకున్న దొంగ కనిపించాడు. వెంటనే ఇంటికి గడియపెట్టి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చి మంచం కింద నిద్రపోతున్న సూరిబాబును బయటకు తీసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వెంకటరెడ్డి వద్ద పెట్రోల్ డబ్బులు ఉన్నది చూసి కాజేయాలనుకుని వచ్చినట్లు పోలీసు విచారణలో సూరిబాబు నిజం ఒప్పుకున్నాడు.