అమరావతి : ప్రజలను ఏలే పాలకులకు విజన్ ఉండాలని, విద్వేషం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో భయంకరంగా విధ్వంస పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వైసీపీ ప్రభుత్వం దుర్మర్గంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై నిలదీసిన వ్యక్తులను, పార్టీలను అణిచివేతకు గురిచేస్తుందని ఆరోపించారు. పేద బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు, ఐటీ విప్లవం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తెలుగుప్రజలు గౌరవప్రదంగా బ్రతుకుతుండడానికి కారణమని టీడీపీ అని గుర్తు చేశారు.
సమస్యలను పరిష్కరించేందుకు సంపద సృష్టించక పోతే అనేక సమస్యలు వస్తాయని దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన విధ్వంసంతో ముందుకు వెళ్తుందని విమర్శించారు. దేశంలో ఎక్కువ ధరలు ఉన్నది ఆంధ్రప్రదేశ్ అని ఆరోపించారు. పన్నులు, ధరల పెంపుదల రాష్ట్రంలో పేదవాడు నిలదొక్కుకోలేని పరిస్థితిని తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్లో రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్తున్నార ని తెలిపారు. పేదవారికి అన్నం పెట్టే సంస్థలు, వ్యక్తులపై దాడులకు పాల్పడం దారుణమని వెల్లడించారు.