అమరావతి : ఏపీలో జరుగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు ఒకటి, రెండు మినహా దాదాపు అభ్యర్థుల అందరి పేర్లను ఖరారు చేశాయి. దీంట్లో భాగంగా జనసేన (Janasena ) మరో ఎంపీ స్థానానికి అభ్యర్థి ( Lokhabha Candidate) పేరును ప్రకటించింది. మచిలిపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashauri) పేరును జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ శనివారం ప్రకటించారు.
ఆవనిగడ్డ(Avanigadda), పాలకొండ(Palakonda) స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేయాల్సి ఉందని పార్టీ జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. ఆవనిగడ్డ నుంచి పోటీకి ఆశావాహులు ఎక్కువ మంది ఉన్న నేపధ్యంలో అక్కడ నిర్వహించే సర్వే ప్రకారం వచ్చే నివేదిక ఆధారంగా అభ్యర్థిని ప్రకటిస్తారని తెలిపారు.
2019 ఎన్నికల్లో మచిలిపట్నం( Machilipatnam) నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బరిలో దిగి విజయం సాధించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిని నిరశిస్తూ గత నెలరోజుల క్రితం పార్టీకి బాలశౌరి రాజీనామా చేశారు. అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరారు. మచిలిపట్నం ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) కి, ఎంపీ వల్లభనేని బాలశౌరి మధ్య చాలా కాలంగా వైరం ఉంది. ఇక్కడి నుంచి బాలశౌరిని నిలపడమే సరైన నిర్ణయంగా భావించిన పవన్ ఆలస్యంగా నైన ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఏపీలో టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ 17 ఎంపీ స్థానాలు, 144 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన 2 ఎంపీ, 21 ఎమ్మెల్యే, బీజేపీ 5 ఎంపీ, 10 ఎమ్మెల్యేల స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.