అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూసర్వేను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోందని, ఈ సర్వేను పూర్తిచేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. దశాబ్దాల తరబడి నెలకొన్న భూ సమస్యలకు సర్వేలో పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు.
సర్వే పూర్తికి అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని, సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణం గా తెప్పించుకోవాలని సూచించారు. డ్రోన్లు, ఓఆర్ఐ పరికరాలు, రోవర్లు, సర్వే రాళ్లు సమకూర్చుకోవడంలో వేగవంతంగా పనులు నిర్వహించాలని సూచించారు.
సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాలనాయడు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.