Srisailam | శ్రీశైలానికి వచ్చే యాత్రికులకు కనీస వసతులు కల్పించడానికి నిత్యాన్నదాన సత్రాల నిర్వాహకులు కూడా సహకరించాలని ట్రస్ట్బోర్డ్ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్ లవన్న కోరారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సత్ర నిర్వాహకులతో మాట్లాడారు. క్షేత్రానికి వచ్చే యాత్రికుల అవసరం కోసం చేపడుతున్న డార్మిటరీ నిర్మాణంలో యాజమాన్యాలతోపాటు దాతలను కూడా భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా వారాంతపు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల దేవస్థానానికి కేటాయించిన గదులను నిర్ణయించిన వారికి ఇవ్వడంలో సహకరించాలని చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్ లవన్న చెప్పారు. దీనితోపాటు ప్రతి సత్రంలో ఆలయ దర్శన వేళలు, ఆర్జిత ప్రత్యక్ష పరోక్ష సేవల వివరాలను పొందుపరచాలని సూచించారు.
సత్ర పరిసరాలలో తప్పకుండా పచ్చదనాన్ని పెంచుతూ ప్లాస్టీక్ నిషేదిత శ్రీశైలం దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్ లవన్న కోరారు. సమావేశంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, సత్ర నిర్వాహకులు పాల్గొన్నారు.