తిరుమల : తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార దీక్షితులు ఆధ్వర్యంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు.
అంతకుముందు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారిని, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగనుందని అర్చకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో పార్వతి, ఆగమ సలహాదారు విష్ణుభట్టచార్యులు, ఏఈవో దుర్గరాజు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.