తిరుపతి : శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి(Kalyana Venkateshwara Swamy) వారి ఆలయంలో గురువారం నుంచి ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ శాస్త్రోక్తంగా ప్రారంభ మయ్యింది. అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు.
మీన లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం (Dwajarohanam) నిర్వహించారు. గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. జేఈవో వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 4న గరుడసేవ, మార్చి 5న స్వర్ణరథోత్సవం, మార్చి 7న రథోత్సవం, మార్చి 8న చక్రస్నానం జరుగనున్నట్టు తెలిపారు. తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు రెండు గొడుగులను కానుకగా జేఈవో వీరబ్రహ్మంకు అందించారు.