అమరావతి : ఏపీలో కూటిమి పేరుతో ఎన్నికలకు వస్తున్న పార్టీలను మరోసారి తరమి కొట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు 99శాతం హామీలు నెరవేర్చామని, ఇంటింటికీ వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకే ఉందని పేర్కొన్నారు. జగన్ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు. లంచాలు, వివక్ష లేని ఐదేండ్ల వైసీపీ (YSP) పాలనలో రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
చంద్రబాబు (Chandra Babu) పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదని, జగన్ పేరు చెబితేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకువస్తాయని పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడ్డుకునేవారిని ఎన్నికల్లో తగినవిధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదల భవిష్యత్ కోసం వైసీపీ గెలుపు ఖాయమనిపిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. 66లక్షల మంది పేదలకు నష్టం కలిగించేలా చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి పింఛన్లు ఆపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మేలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. విపక్షాల పొత్తుతో ఎవరూ భయపడడం లేదని తెలిపారు.