అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ సీనియర్నేత అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీని కూల్చివేయడం పట్ల ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అయ్యన్నపాత్రుడు రెండు సెంట్ల పంటకాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆదివారం అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను కూల్చివేశారు. అయితే ఈ నెల రెండో తేదీన అందజేసిన నోటీసుకు తాము సమాధానం ఇవ్వకుండానే గోడ తొలగించడం పట్ల అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాకుండా పోలీసులు పట్టణంలో ముందు జాగ్రత్తగా ఏసీపీ పర్యవేక్షణలో బందోబస్తును ఏర్పాటు చేశారు. అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటుచేసి ఎవరిని రానియకుండా అడ్డుకున్నారు. రాత్రి నుంచి ఇంటి చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయంలో అయ్యన్న కుమారుడు రాజేశ్ మాట్లాడుతూ అన్ని నియమాలకు లోబడే ఇంటి నిర్మాణం చేశామని, అధికారులు అన్యాయంగా ఇంటిని కూల్చేశారని ఆరోపించారు.