చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ రోడ్డులోని లక్ష్మీ సినిమా హాలు సమీపంలోని పుష్ప కిడ్స్ షాపులోకి ఆరుగురు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. లోపలికి వెళ్లగానే యజమానిపై రాడ్తో దుండగులు దాడి చేశారు. అయితే దుండగుల నుంచి షాపు యజమాని తప్పించుకున్నాడు. అది చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముగ్గుర్ని పట్టుకున్నారు. మరో ముగ్గురు షాపులో ఉండగానే స్థానికులు తాళం వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ సమయంలో దుండగులు కాల్పుల్లోకి చొరబడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. షాపులోపల ఉన్న దుండగుల దగ్గర మరిన్ని తుపాకులు ఉండొచ్చని భావించిన పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఆ చుట్టుపక్కల వారిని తక్షణమే ఖాళీ చేయించి బయటకు పంపించేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
షాపులో చొరబడ్డ దుండగులను దోపిడీ దొంగలుగా పోలీసులు భావిస్తున్నారు. సమీపంలోని ఐడీబీఐ బ్యాంకులో చోరీ కోసం వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.