కృష్ణా జిల్లా : మచిలీపట్నం మండలం గారాలదిబ్బ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. టీడీపీ కార్యకర్తల దాడిలో వైసీపీకి చెందిన ఒడుగు నాగరాజు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. ఒడుగు నాగరాజు మృతదేహంతో వైసీపీ కారకర్తలు ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు సర్దిచెప్పడంతో బందోబస్తు మధ్య నాగరాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. గ్రామంలో ఘర్షణలను నివారించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మచిలీపట్నం మండలం గారాలదిబ్బలో పంచాయతీ ఎన్నికల అనంతరం వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య విబేధాలు పొడసూపాయి. గత నెల 5 న టీడీపీ నాయకులు గ్రామంలోకి ప్రవేశించి వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడికి దిగారు. టీడీపీ శ్రేణుల దాడిలో ఒడుగు నాగరాజు, నిరీక్షణరావు, శివరాజు, రాజ్కుమార్, ఏడుకొండలు, శివ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మచిలీపట్నం సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం నాగరాజును డిశ్చార్జి చేశారు. అయితే, పూర్తిగా కోలుకోకపోవడంతో పాటు వాంతులు చేసుకోవడంతో తిరిగి 22న మరోసారి దవాఖానలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో విజయవాడకు తీసుకెళ్లారు. అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడే ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు.
నాగరాజు మృతికి టీడీపీ కార్యకర్తలే కారణమంటూ గారాలదిబ్బ వద్ద స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 5న జరిగిన దాడి విషయంలో వివిధ సెక్షన్ల కింద బొడ్డు వీరవెంకటేశ్వరరావు, బొడ్డు నాగబాబు సహా 12 మంది టీడీపీ కార్యకర్తలపై మచిలీపట్నం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగరాజు చనిపోయిన తర్వాత సెక్షన్ 302 కూడా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చిలకలపూడి, పెడన, చల్లపల్లికి చెందిన పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.