అమరావతి : ఏపీ మంత్రి రోజా టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ మహిళా ద్రోహుల పార్టీ అని ఆరోపించారు. అందరి కంటే పెద్ద ఉన్మాది చంద్రబాబే అని విరుచుకు పడ్డారు. ఇవాళ రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..టీడీపీలో ఉన్నంత మంది ఉన్మాదులు దేశంలో మరెక్కడా లేరని పేర్కొన్నారు. కొడుకు నారా లోకేశ్ను ఎమ్మెల్యేగా గెలిపించలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ చీరలు కట్టుకోవాలని ఘాటుగా విమర్శించారు.
రాష్ట్రంలో ఏ ఒక్క మంచిపని చేయలేని నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి మారణకాండ సృష్టించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు . వైసీపీలో ప్రతి ఒక్క మహిళను గౌరవించి , రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏపీ సీఎం జగన్ చేపడుతున్నారని ప్రశంసించారు. క్యాబినేట్లో మహిళకు సముచిత స్థానం కల్పించారని సచివాలయ వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలు, మహిళా రక్షణకు అనేక కార్యక్రమాలు, దిశ యాప్, దిశ చట్టంను తీసుకువచ్చారని గుర్తు చేశారు.
ఇటీవల విజయవాడ ఘటన జరుగగానే వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని, బాధ్యులకు శిక్ష వేయించామని, బాధితులకు ఆర్థిక పరిహారం అందించి అండగా నిలిచామని అన్నారు. రాష్ట్రంలో సోషల్ మీడియాలో మహిళలు అగౌరవ పరిచిన రెండు లక్షల మందిపై నిరంతర నిఘా ఉంచామని వెల్లడించారు. 12 సంవత్సరాల వైసీపీ పార్టీ దమ్ము ఇంకా తెలియరాలేదా అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు.
,