తూర్పు గోదావరి జిల్లా : ఏపీ హోం మంత్రి తానేటి వనితకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె స్వంత నియోజకవర్గమైన కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ బలపరిచ్చిన వారెవరూ పోటీలో కనిపించలేదు. ఇది తానేటి వనితకు చెదు అనుభవంగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
కొవ్వూరు అర్బన్ బ్యాంక్కు జరిగిన ఎన్నికల్లో 11 డెరెక్టర్ స్థానాలను టీడీపీ బలపర్చిన అభ్యర్థులు ఏకగీవ్రంగా గెలుపొందారు. నూతన డైరెక్టర్లంతా కలిసి టీడీపీ నాయకుడు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు మద్దిపట్ల శివరామకృష్ణను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. దీంతో మద్దిపట్ల శివరామకృష్ణ వరుసగా ఐదోసారి బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే మద్దిపట్ల నాలుగుసార్లు బ్యాంక్ చైర్మన్గా కొనసాగారు. ఈ సారి ఎలాగైనా మద్దిపట్లను ఓడించేందుకు కృషిచేయాలని తానేటి వనిత పార్టీ శ్రేణులకు సూచించింది.
త్రీమాన్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికలు వాయిదా వేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుల వ్యూహాలను పసిగట్టడంలో హోంమంత్రి వనిత విఫలమయ్యారు. ఇటీవల తిరుపతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో గెలిచిన తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ గెలుస్తామని వైసీపీ నేతలు భావించారు. కానీ అలా జరగకపోవడంతో ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి తానేటి వనిత 25 వేల మెజార్టీతో గెలుపొందారు.