Chandrababu | మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలని పార్టీ నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొందరు నేతలు దూకుడుగా మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన పొలిట్బ్యూరో సమావేశం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత దూకుడుగా వెళ్లాలని తీర్మానించింది.
మహిళలపై జరుగుతున్న దుష్ప్రచారం, అసెంబ్లీలో జరిగిన ఘటనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కూడా తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఆత్మగౌరవ సభలు జరుపాలని కూడా టీడీపీ నిర్ణయించింది. ఇక పార్టీలో కష్టపడి పని చేసే వారికే టికెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. షో చేసే వారిని ఇక పక్కనబెడతామని స్పష్టం చేశారు. కర్చీఫ్ వేసుకుని కూర్చుంటున్న కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. మారిన రాజకీయాలకు అనుగుణంగా మనం కూడా మారాలని చెప్పుకొచ్చారు. అవసరమైన మేరకు మాత్రమే భువనేశ్వరి ప్రకటన చేశారని.. ఆ మేరకు ప్రజల్లోకి వెళ్లిందని సమావేశంలో పాల్గొన్న నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది.