AP Assembly | ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో అసెంబ్లీలో గందరగోళం నెలకొన్నది. టీడీపీ సభ్యులు పేపర్లను చింపి స్పీకర్పై వేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినదించారు. మరో నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెన్షన్ విధించారు.
సస్పెన్షన్ విధించినా వెళ్లకుండా నినదించారు. అనంతరం స్పీకర్ ఆఫీసులోకి చొచ్చుకు వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయగా.. మార్షల్స్ అడ్డుకున్నారు. స్పీకర్ ఆఫీస్ ముందుసస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఆ తర్వాత సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కేవలం సభను అడ్డుకునేందుకు మాత్రమే వచ్చారని. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.
మీడియా పాయింట్లో మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఎన్నుకున్న వారు జవాబుదారిగా పని చేయాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వం ద్వారా జరిగిన మంచిని చెబితే వినలేక వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను ఆదుకోవడంలో వారి పాత్ర శూన్యమని.. మీడియాలో కనిపించేందుకే సభలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. విఫల ప్రతిపక్షం ఏపీలో ఉందా అంటూ మంత్రి ప్రశ్నించారు.