అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సభా మర్యాదాలు లేకుండా వ్యవహరిస్తున్న టీడీపీ సభ్యులపై స్పీకర్గా విచక్షణ అధికారాలు ఉపయోగించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణల మేరకు ప్రభుత్వం అంశాల వారీగా చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసినా అసెంబ్లీ సమావేశాల్లో ఆందోళన కొనసాగిస్తుండడం విచారకరమని పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వ్యవహారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్కు సూచించారు. నాడు ఎన్టీఆర్ మద్యపాన నిషేదం విధిస్తే చంద్రబాబు బెల్టు షాపులు తెరిచారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్టు షాపులను రద్దు చేసిందని గుర్తు చేశారు. మద్యపానం రేట్లు పెంచితే తగ్గించాలని టీడీపీ నిరసనలు చేసిందని విమర్శించారు.
సహజ మరణాలను కల్తీసారాకు లింకు పెడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి నీళ్ల బదులు లిక్కర్ మాత్రం ఇచ్చిందని కదిరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సారా మరణాలపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసనలపై ఆమె మాట్లాడారు. ఎనీటైమ్ మందు దొరికేలా చంద్రబాబు పాలన కొనసాగిందని దుయ్యబట్టారు. మద్యం కమీషన్ల కోసం మద్యాన్ని ఏరులై పారించారని ఆమె అన్నారు. బడి, గుడి తేడా లేకుండా బెల్టు షాపులు పెట్టించారని విమర్శించారు.