అమరావతి : కరోనా ప్రభావం తరువాత మూడేండ్లకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు ఒంగోలులో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే మహానాడుకు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్తో పాటు ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చంద్రబాబు ఫొటో ప్రదర్శన, రక్తదాన శిబిరాల్ని ప్రారంభించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి , పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 40 సంవత్సరాల్లో ఏనాడు జరగని విధంగా గడిచిన వైసీపీ మూడేండ్ల పాలనలో పార్టీ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు అనేక ఇబ్బందులకు గురయ్యారని వివరించారు. రేపు అధికారంలోకి రాబోతున్నామని, ప్రజలకు మరిన్ని అధికారాలను కట్టబెట్టనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులపాలు చేసిన వారి తాట తీస్తామని కార్యకర్తల్లో జోష్ ను నింపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపైన పోలీసులు పెట్టిన కేసులను అధికారంలోకి రాగానే ఒకే ఒక సంతకంతో వాటిని కొట్టివేస్తామని తెలిపారు.
వైసీపీ మాదిరిగా గాలికి పుట్టిన పార్టీ కాదని, తమది బడుగు, బలహీనవర్గాల నుంచి పుట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఈ పార్టీని ప్రజల నుంచి దూరం చేయాలన్నా ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న టీడీపీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రజలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని తెలిపారు.