అధికార వైసీపీకి తెలుగుదేశం కౌంటర్ ఇచ్చింది. రాజ్యసభ అభ్యర్థుల కేటాయింపులో తాము బీసీలకు పెద్ద పీట వేశామన్న వైసీపీ వాదనకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. అసలు బీసీల వెన్నెముక విరగ్గొట్టిందే వైసీపీ అంటూ విరుచుకుపడ్డారు. సీఎం సీటులోంచి జగన్ పక్కకు తప్పుకొని, బీసీలకు సీఎం సీటు ఇవ్వగలరా? అంటూ యనమల సూటిగా ప్రశ్నించారు.
వైసీపీలో సీఎం జగన్ ఓ వర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ… బీసీలను అణగదొక్కుతున్నారని, ఇది నిజం కాదా? అంటూ నిలదీశారు. తమ పార్టీలో బీసీ నేతలమైన అచ్చన్నాయుడు, తాను, అయ్యన్న పాత్రుడో మాట్లాడతామని, వైసీపీలో ప్రతి దానికీ ఎవరు మాట్లాడతారో ప్రజలకు తెలుసంటూ పరోక్షంగా సజ్జలను విమర్శించారు. సజ్జల, విజయసాయి రెడ్డి, వైవీ లాంటి వారికే వైసీపీలో ప్రాధాన్యముంటుందన్నారు.
టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని యనమల స్పష్టం చేశారు. సీఎం జగన్ రాజ్యసభకు నామినేట్ చేసిన ఆర్. కృష్ణయ్య, మస్తాన్ రావు టీడీపీ నుంచి వెళ్లిన వారేనని గుర్తు చేశారు. వైసీపీలో బీసీ నేతలెవ్వరూ లేరు కాబట్టే, ఇతర పార్టీల నుంచి వెళ్లిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకు పదవులు ఇవ్వడం మంచిదే గానీ… ప్రాధాన్యం లేని పదవులు దక్కుతున్నాయని యనమల విమర్శించారు.