Kesineni Chinni | టీడీపీ నుంచి బయటకొచ్చే సమయంలో కేశినేని నాని చేసిన విమర్శలపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్న స్పందించారు. చంద్రబాబు, లోకేశ్ తన కుటుంబంలో చిచ్చు పెట్టారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కుటుంబ విషయాలు, పార్టీ విషయాలు కలపకూడదనే ఉద్దేశంతో ఈ విబేధాలపై ఏనాడూ మాట్లాడలేదని కేశినేని చిన్ని తెలిపారు. నిజానికి తమ కుటుంబంలో సమస్యలు ఎప్పట్నుంచో ఉన్నాయన్నారు. 1999 నుంచి తానే సర్దుకుపోతున్నానని తెలిపారు. ఒక స్టిక్కర్ విషయంలో తన భార్యపై కేసు పెట్టింది కేశినేని నాని అని అన్నారు. తన కొడుక్కి గ్రీన్ కార్డు రానివ్వనని బంధుమిత్రుల దగ్గర కేశినేని నాని వ్యాఖ్యానించారని.. కుటుంబంలో అందర్నీ రకరకాలుగా వ్యాఖ్యానించారని బయటపెట్టారు. కానీ ఏ రోజు కుటుంబ సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావద్దనే బాధ్యత ఇన్ని రోజులు ఓపిగ్గా ఉన్నానని తెలిపారు. తమ కుటుంబ సభ్యుల తరఫున చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.
నారా లోకేశ్పై కేశినేని నాని విమర్శలపై కూడా చిన్ని స్పందించారు. లోకేశ్ స్థాయి ఏంటని నాని అడిగారని గుర్తు చేసిన చిన్ని.. మాజీ సీఎం మనమడు, ఇంకో సీఎం తనయుడు, అంతేకాకుండా ఆయన యువగళం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటి నడిచి.. ఆయన నాయకత్వ పటిమ ఏంటో తెలిపారని స్పష్టం చేశారు. తమ కుటుంబం స్థాయి.. లోకేశ్ కుటుంబాలను విమర్శించే స్థాయి కాదన్నారు. ఆయన్ను విమర్శించే స్థాయిలో లేమని అన్నారు. తమ స్థాయిని నిర్ణయించాల్సింది ప్రజలు, పార్టీ కార్యకర్తలే అని స్పష్టం చేశారు. జగన్ అవినీతిపరుడు, అమరావతిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించిన నాని.. ఇప్పుడు జగన్ను కౌగిలించుకోవడం చూస్తే ఇంతకంటే దౌర్భాగ్యం లేదనిపిస్తుందని అన్నారు. తమ కుటుంబంలో జరిగిన విషయాలన్నీ తమ వ్యక్తిగతమని.. పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ రాకముందు నుంచే తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. తప్పకుండా దీనికి శాస్తి అనుభవిస్తారని అన్నారు.