అమరావతి: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన బీసీ నేత గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గంజి చిరంజీవి వైసీపీలో చేరడం మంగళగిరిలో టీడీపీకి పెద్ద షాక్గా చెప్పవచ్చు. నారా లోకేశ్ అనుచరుడిగా పేరున్న చిరంజీవి.. గత కొంతకాలంగా టీడీపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు.
మంగళగిరి చేనేత కుటుంబానికి చెందిన టీడీపీ ముఖ్య నేత అయిన గంజి చిరంజీవి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా ఆహ్వానించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనమంతరావుతో కలసి జగన్ వద్దకు గంజి చిరంజీవి వచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి.. వైసీపీలో చేరడంతో టీడీపీ నేతలు మరీ ముఖ్యంగా నారా లోకేశ్ షాక్ గురయ్యారు. గంజి చిరంజీవి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు నారా లోకేశ్ ఇటీవల ప్రకటించారు. అప్పటి నుంచి చిరంజీవి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తనకు అవకాశం కల్పిస్తామని చెప్పి తన కొడుక్కి నియోజకవర్గం కట్టబెట్టడంపై చంద్రబాబుపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దాంతో ఇటీవల టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు.
అంతా అనుకున్నట్లుగానే గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. బలహీన వర్గాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నందున.. ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు వైసీపీలో చేరుతున్నట్లు గంజి చిరంజీవి ప్రకటించారు. టీడీపీలో పెత్తనమంతా ఒక సామాజికవర్గానిదేనని ఈ సందర్భంగా చిరంజీవి ఆరోపించారు. అందుకే తాను టీడీపీని వీడి వైసీపీలో చేరానని చెప్పారు. టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని, వారికి స్థానం లేకుండా చేసే కుట్ర జరుగుతున్నదని అన్నారు. ఆ కుట్రలో భాగంగానే తనకు అన్యాయం చేశారని చిరంజీవి పేర్కొన్నారు.