అమరావతి : వైసీపీ మేనిఫెస్టో చూడడానికి టీడీపీ భయపడుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు గుంటూరులో ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను ఏపీ సీఎం సభా ప్రాంగణంలో పార్టీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను, ఇచ్చిన హామీల అమలును చూసి టీడీపీ తన మేనిఫెస్టోను యూ ట్యూబ్నుంచి , సొంత వెబ్సైట్ నుంచి తొలిగించిందని అన్నారు. మేనిఫెస్టో మాయం చేసిన ఘనత టీడీపీదని విమర్శించారు.
ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముంచేశారని అన్నారు. అతడు చేసిన అప్పులు, బకాయిలను తమ మూడేండ్ల పాలనలో తీర్చామని, నవరత్నాల పాలనను అందిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. మంచి చేసిన చరిత్ర, మాటకు కట్టుబడి లేని ప్రతిపక్షానికి ఆరోపించే, విమర్శించే నైతిక లేదని అన్నారు. అసూయతో గిట్టని వారు పార్టీపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
14 సంవత్సరాల పాటు సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోవడంతో కడుపు మంటతో అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారని ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై విరుచుకుపడ్డారు. కులాల కుంపటితో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం అంటే అహంకారం కాదని అన్నారు.